ArticlesNews

భారత్ అణుశక్తి కాకూడదనే లాల్‌ బహదూర్‌ శాస్త్రి హత్య!

994views
  • సిఐఎ కుట్రతోనే హోమి జహంగీర్‌ భాభా హత్య

ఇంతకాలం అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత రెండో ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రిది సహజమరణం కాదని, ఆయనకు హత్యకు గురయ్యారని పలు ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు దాదాపు అదే సమయంలో మరణించిన భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్‌ భాభాది కూడా విమాన ప్రమాదంలో జరిగిన మరణం కాదని, అది కూడా భారీ కుట్రతో చేసిన హత్య అని స్పష్టమైనది.

ఈ రెండు హత్యలకు భారీ కుట్ర పన్నింది అగ్రరాజ్యం అమెరికా అని కూడా వెల్లడవుతుంది. భారత దేశంను అణుశక్తి సమకూర్చుకోకుండా అడ్డుకోవడం కోసమే అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) జరిపిన భారీ కుట్రల కారణంగానే వీరిద్దరూ అకాలమరణం చెందిన్నట్టు వెల్లడైనది. ఈ ఇరువురు ప్రముఖుల మరణాలు జరిగినప్పుడు సీఐఏ ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వర్తించిన రాబర్ట్‌ క్రౌలీ స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

‘కాన్వర్సేషన్స్ విత్ ది క్రో’లో వెల్ల‌డి

భారతదేశ అణు కార్యక్రమాన్ని స్తంభింపజేసేందుకే ఈ హత్యలు జరిగాయని ఆ సిఐఎ అధికారి వెల్లడించారు. జర్నలిస్ట్ , ‘ది న్యూ ఇండియన్’ వ్యవస్థాపకురాలు, ఆర్తి టికూ, సిఐఎ అధికారి రాబర్ట్ క్రౌలీ, జర్నలిస్ట్ గ్రెగొరీ డగ్లస్ మధ్య జరిగిన ఆరోపణ సంభాషణను కాన్వర్సేషన్స్ విత్ ది క్రో అనే పుస్తకంలో ప్రచురించారు.

దానితో వీరి మరణాలపై ఇప్పటి వరకు నెలకొన్న అనుమానాలు నివృత్తమైనట్టే చెప్పవచ్చు. రాబర్ట్‌ క్రౌలీతో సంభాషణల రికార్డులను ప్రస్తావిస్తూ శాస్త్రి, భాభాలది సీఐఏ చేసిన హత్య అని వివరించారు.

గోవులను ప్రేమించే భారతీయులు ఎంతో తెలివైనవారు…

“గోవులను ప్రేమించే భారతీయులు ఎంతో తెలివైనవారు. ప్రపంచంలో వారు గొప్ప శక్తిగా ఎదగబోతున్నారు. భారతీయులు స్వయంసమృద్ధి సాధించడాన్ని మేము కోరుకోలేదు’’ అని పేర్కొన్నారు.

భారత్‌ అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్ళ‌డంలో శాస్త్రి, భాభా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయం అది అని, రష్యాతో భారత్‌ అంటకాగుటున్న నేపథ్యంలో ఆ చర్యలు అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి, వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని వివరించారు.

భాభాను వియన్నా వెళ్తుండగా హతమార్చం…

‘‘హోమి భాభాను ఎయిర్‌ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చాం. విమానంలోకి పేలుడు పదార్థాలు పంపడం ఓ పెద్ద తంతు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చేద్దామనుకున్నాం. చివరి నిమిషంలో పర్వత ప్రాంతంలో కూలిపోయేలా చేశాం” అంటూ జరిగిన సంఘటనను వెల్లడించారు.

“ఎందుకంటే.. విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి ఎత్తైన పర్వతప్రాంతం అనువైన ప్రదేశం. పైగా, అక్కడ జన నష్టం తక్కువగా ఉంటుంది. మహా అయితే.. పర్వత ప్రాంతాల్లోని నాలుగైదు మేకలో.. గొర్రెలో మరణిస్తాయి. అదే వియన్నా నగరంపైన విమానం కూలితే.. మరణాలు ఎక్కువగా ఉంటాయి’’ అని క్రౌలీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

భారత్‌ను అణ్వాయుధ దేశంగా మార్చే శక్తి భాభాకు ఉందని, అతను ఎప్పటికైనా దాన్ని సాధిస్తాడని, అందుకే అతణ్ని చంపాలని సీఐఏ నిర్ణయించిందని వెల్లడించారు. అతని హత్యకు ముందు ఆయన రేడియోలో ఓ కీలక ప్రకటన చేయడం కూడా సీఐఏ తన టాస్క్‌ను త్వరగా (జనవరి 24, 1966న) పూర్తిచేయడానికి కారణమైందని తెలిపారు.

‘‘18 నెలల్లో భారత్‌ అణ్వస్త్ర దేశం కానుంది’’ అని భాభా రేడియోలో ప్రకటించారని గుర్తు చేశారు. కాగా.. ఈ ప్రమాదంలో భాభాతో పాటు, విమానంలో ఉన్న 116 మంది కూడా మరణించారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి కూడా అణ్వాస్త్ర కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్ళారని క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు.

తొలుత తమ శత్రుదేశమైన పాకిస్తాన్‌పైనే వేస్తారని…

‘‘1966 జనవరి 11న పాక్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్‌ రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై సంతకం చేశారు. అదే రోజు అర్ధరాత్రి దాటాక.. 1.32 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం వెనకా సీఐఏ ఉంది’’ అని క్రౌలీ పేర్కొన్నారు.

భారతీయులు అణుబాంబును తయారు చేస్తే దాన్ని తొలుత తమ శత్రుదేశమైన పాకిస్తాన్‌ పైనే వేస్తారని భావించామని ఆయన వివరించారు. భారత అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సీఐఏ ఎన్ని ప్రయత్నాలు చేసినా 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మొదటి అణ్వాస్త్ర ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం.

అమెరికా మరో దుర్మార్గం… వ‌రి సాగుపై ప‌గ‌!

అమెరికా మరో దుర్మార్గానికి కూడా ఒడిగట్టింది. ఆసియాలో వరి సాగు అనేదే లేకుండా చేసేందుకు కూడా సీఐఏ కుట్ర పన్నిందని కూడా రాబర్ట్‌ తన పుస్తకంలో వివరించారు. అందుకోసం ఓ వ్యాధిని అభివృద్ధి చేశామంటూ సంచలన విషయాన్ని వివరించారు. వరి లేకుంటే ఆసియా ప్రజలు ఆకలితో అలమటించి మరణిస్తారని తాము అంచనా వేసినట్టు చెప్పారు. కాని, దాన్ని అమలు చేయలేకపోయామని తెలిపారు.

1948లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటైన తర్వాత అణ్వాయుధాల విలువను గుర్తించి డాక్ట‌ర్ హోమీ భాభా భారతదేశాన్ని అణు దేశంగా మార్చాలని ప్రతిపాదించారు. అయితే, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అంశంపై సందిగ్ధ వైఖరిని అవ‌లంబించారు. అయితే, 1962 చైనా-భారత్ యుద్ధం, 1965 పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత భారతదేశం అణ్వాయుధాల కోసం మరింత దూకుడుగా ముందుకు సాగడం ప్రారంభించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి