News

డ్రాగన్ కంట్రీ కంత్రీ బుద్ధి! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం

427views

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది.

తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను పంగ్డా అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో ఈ దురాక్రమణ విషయం బట్టబయలైంది. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ మక్సార్ ఈ శాటిలైట్ ఇమేజెస్‌ను విడుదల చేసింది. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి చైనా నిర్మించిన గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.

భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ళ కిందటే 2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే, అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటంపై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఆ ఏడాది దాదాపు 73 రోజుల పాటు భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది.

దురాక్రమణవాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా..భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని అప్పుడు మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. చైనా తన ‘సలామీ స్లైసింగ్‌’ విధానాన్ని భూటాన్‌పై ప్రయోగిస్తోందనేది నిపుణులు అంచనా వేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి