
ఇస్లామాబాద్: ఉగ్రవాద దేశంలో అరాచకాలకు అడ్డుఅదుపు లేదు. పాకిస్తాన్లో నిత్యం మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంలా మారాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన 21 ఏళ్ళ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మాన్రోయ్లో ఈ నెల 17న యువతిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెలల కిందట పాకిస్తాన్కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్బుక్లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు.
అయితే, ఆదివారం రోజు ఫోర్ట్ మాన్రోయ్ సందర్శిద్దాం.. అక్కడికి రావాలని అమెరికా యువతిని వారిద్దరూ కోరారు. దీంతో ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ హోటల్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీకరించి, ఆమెను బెదిరింపులకు గురిచేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
Source: NationalistHub





