
-
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ రచన
విజయవాడ: ఒడిశాకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు బక్సీ జగబంధు.. బ్రిటిషర్లపై చేసిన వీరోచిత సాయుధ పోరాటంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒడియాలో రచించిన ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రదర్శించనున్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నాటక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 1803-1808 మధ్యకాలంలో కటక్, పూరీ, ఖోర్ధాలను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంత పాలకుడు గజపతి ముకుందదేవ్ని నిర్బంధించారు. రైతుల నుంచి అధిక పన్నులు వసూలు చేశారు. సముద్రం, చిలకా తీరాల నుంచి ఉప్పు సేకరించకుండా నిషేధించి, ప్రజల్ని తీవ్రంగా హింసించారు. అప్పుడు ముకుంద్దేవ్ సేనాపతి బక్సీ జగబంధు.. పైకా నాయకుల్ని ఏకం చేసి బ్రిటిష్వారిపై పోరాడి ఖోర్ధా, పూరీలను స్వాధీనం చేసుకున్నారు.





