News

గంగూలీకి బ్రిటిష్ పార్లమెంట్‌లో సత్కారం!

321views

కోల్‌క‌తా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి(జులై 13) 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది.

ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించారు. బ్రిటిష్ పార్లమెంట్‌ తనను సత్కరించినందుకు ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్‌ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు.

కాగా, జులై 13, 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్‌ పార్లమెంట్‌ గంగూలీని గౌరవించింది.

ఆ మ్యాచ్‌లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో మూడు బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్‌ సింగ్‌(69), మహ్మద్‌ కైఫ్‌(87 నాటౌట్‌)లు మరపురాని ఇన్నింగ్స్‌ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు.

ఆ మ్యాచ్‌లో కైఫ్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టిన అనంతరం కెప్టెన్‌ గంగూలీ షర్ట్‌ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్‌ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్‌గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్‌ పార్లమెంట్‌ దాదాను సత్కరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి