
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు.
విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ బోధన చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే, విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
Source: NationalistHub





