
ఉదయపూర్: రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయ్ పూర్ ఐజీతో, ఎస్పీతో పాటు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది గెహ్లాట్ సర్కార్. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఉదయ్ పూర్ పోలీసులు అతనికి భద్రత కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కన్హయ్య లాల్ను చంపడమే కాకుండా.. ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు నిందితులు.
ప్రస్తుతం ఈ కేసులో నిందితులిద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు మరో 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును విచారిస్తోంది. నిందితులిద్దరికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ దావత్-ఏ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని.. నిందితుల్లో ఒకరు 2014లో కరాచీకి కూడా వెళ్ళి వచ్చారని విచారణలో తేలింది. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐని సస్పెండ్ చేశారు అధికారులు. ఘటనకు పాల్పడిన నిందితులను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
Source: Nijamtoday





