
భాగ్యనగరం: భాగ్యనగర వైభవం.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. హైదరాబాద్లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్ళుగా కరోనాతో సందడి కాస్త తగ్గినా.. ఈయేడు ఘనంగా నిర్వహిస్తోంది.
గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోట నుంచి ఆరంభమైన బోనాలు.. చివరకు లాల్దర్వాజ అమ్మవారి వద్ద పూర్తవుతాయి. బోనాల మాసమంతా భాగ్యనగరం సందడిగా మారుతుంది. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బోనాల వైభవం.. శివసత్తుల పూనకాలు.. అందంగా ముస్తాబైన భక్తులు.. పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట కోలాహలంగా మారింది.





