News

గేమ్​ పేరిట బాలుడికి హ్యాకర్ వల.. త‌ల్లిదండ్రుల ఫోన్లూ హ్యాక్!

491views

జైపూర్‌: ఓ సైబర్​ హ్యాకర్​ 13 ఏళ్ళ‌ చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్​ చేశాడు. ఈ ఘటన రాజ‌స్తాన్ జైపుర్​లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైపూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుంటాడు. అతడికి కొంతమందితో స్నేహం ఏర్పడింది. అందులో హ్యాకర్​ కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో అతడికి ఒక లింక్​ పంపి.. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు పంపాలని కోరాడు. అడిగిన సమాచారం మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చేశాడు. ఓటీపీలను కూడా హ్యాకర్​కు షేర్​ చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొబైల్‌లో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు చెందిన మూడు ఫోన్లను హ్యాక్​ చేసి.. వారికి తెలియకుండా సోషల్​ మీడియాలో అసభ్యకర ఫొటోలు, పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.

బాలుడికి టాస్క్​లు కూడా ఇచ్చేవాడు ఆ హ్యాకర్. చెప్పిన పని చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలుడు తన ఇంట్లోనే స్పై చేయాల్సి వచ్చింది. హ్యాకర్ చెప్పినట్టు.. ఇంట్లోని గోడలకు, టేబుళ్ల కింద చిన్న చిన్న చిన్న డివైజ్‌లు అమర్చాడు.

ఈ పరిణామాలు బాలుడి తల్లిదండ్రులకు అనుమానాన్ని కలిగేలా చేశాయి. సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు కనిపించడం.. ఇంట్లోని గోడలకు డివైజ్​లు ఉండడం చూసి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి, బాలుడిని ప్రశ్నించి.. అసలు విషయం తెలిసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి