News

కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…

592views
  • బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు

తిరువ‌నంత‌పురం: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. అయితే, ఆ వివరాలను గోప్యంగా ఉంచారు.

“2016లో సీఎం దుబాయ్​ పర్యటన సందర్భంగా మాజీ ప్రిన్సిపల్​ సెక్రటరీ ఎం.శివశంకర్​ నన్ను సంప్రదించారు. సీఎం త్రివేండ్రంలో బ్యాగ్​ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్​ చేర్చాలని చెప్పారు. ఈ క్రమంలో దుబాయ్​ కాన్సులేట్​లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్​ను ఇచ్చాను. కానీ, అక్కడ స్కానింగ్​లో బ్యాగ్​ నిండా డబ్బు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్​లో భాగం కావాల్సి వచ్చింది. అంతేకాదు.. దుబాయ్​ కాన్సులేట్​ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు.” అని స్వప్న సురేశ్ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్టు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీఎం, ఆయన కుటుంబసభ్యులు సహా ఎం.శివశంకర్, మంత్రి కేటీ జలీల్​, ప్రైవేట్​ సెక్రటరీ సీఎం రవీంద్రన్​ కూడా భాగమయ్యారని ఆరోపించారు స్వప్న.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి