
-
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెట్టినట్టు రక్షణ వర్గాల ధ్రువీకరణ
పంజాబ్: చండీగఢ్ పోలీసులు బురైల్ జైలు వెనుక గోడ దగ్గర లైవ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఎల్ఈడీ)ని స్వాధీనం చేసుకున్న ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించగా పాక్ ఉగ్రవాద సంబంధాలున్నాయని తేలింది. చండీగఢ్ పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో బురైల్ జైలు గోడ వెనుక పొగ రావడాన్ని గమనించారు. పోలీసులు నిశితంగా పరిశీలించగా టిఫిన్, డిటోనేటర్, కోడెక్స్ వైర్ కాలిపోవడం కనిపించింది. వెంటనే మంటలను అదుపు చేసి అనుమానిత పేలుడు పదార్థాలను పేలకుండా చేశారు.
చండీగఢ్ జిల్లా క్రైం స్క్వాడ్ అధిపతి నరీందర్ పాటియల్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఎస్ఎస్పీ, ఎన్ఎస్జి బాంబు నిర్వీర్య స్క్వాడ్ ను పిలిపించారు. డిటోనేటరును పాకిస్తానీ ఉర్దూ వార్తపత్రికలో చుట్టడంతో ఈ పేలుడు పదార్థాల వెనుక పాక్ హస్తం ఉందని పోలీసులు తేల్చారు.
దీంతోపాటు పేలుడు పదార్థాలున్న స్థలంలో ఖలిస్థాన్ యాక్షన్ ఫోర్స్ పేరిట రాసిన ప్రింట్ అవుట్ లు, నల్లని బ్యాక్ ప్యాక్ కూడా దొరికాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ డంప్ డేటాను సేకరించారు. పలు అనుమానాస్పద పోన్ నంబర్లను షార్ట్లిస్ట్ చేశారు. తదుపరి విశ్లేషణలో సంఘటన జరిగినప్పటి నుంచి ఒక మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉందని తేలింది.
ఈ నంబర్ నుంచి జర్మనీకి ఒక అంతర్జాతీయ కాల్ వెళ్ళివుంది. ఉగ్రవాద కార్యకలాపాలపై ముందస్తు దర్యాప్తులో జేఎస్ ముల్తానీ పేరును గుర్తించారు. పోలీసులు తదుపరి సాక్ష్యాలను వెతకడానికి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.





