
511views
జైపూర్: భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్ విధానంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. భాషా వైవిధ్యం భారతదేశానికి గర్వకారణమని స్పష్టం చేశారు.
ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని ప్రధాని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.
Source: Nijamtoday





