-
మొగల్ చక్రవర్తుల నామాలు మార్చండి
-
హిందూ సంస్థల డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)కు ఓ లేఖ రాశారు. తుగ్లక్ రోడ్, అక్బర్ రోడ్, ఔరంగజేబ్ లేన్, హుమాయూన్ రోడ్, షాజహాన్ రోడ్.. వీటి పేర్లను తక్షణమే మార్చేయాలని డిమాండ్ చేశారాయన. అంతేకాదు.. వాటికి ఏయే పేర్లను పెట్టాలో కూడా సూచించాడు ఆ లేఖలో.
తుగ్లక్రోడ్ను గురు గోవింద్ సింగ్ మార్గ్, అక్బర్ రోడ్ను మహారాణా ప్రతాప్ రోడ్, ఔరంగజేబ్ లేన్ను అబ్దుల్ కలాం లేన్, హుమాయూన్ లేన్ను మహర్షి వాల్మీకి రోడ్, షాజహాన్రోడ్ను జనరల్ బిపిన్ రావత్గా మార్చేయాలంటూ డిమాండ్ చేశారు. పోయిన నెలలోనూ ఆయన 40 ఊర్ల పేర్లను మార్చాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సైతం ఒక డిమాండ్ చేశారు.
అలాగే బాబర్ లేన్ను స్వతంత్ర సమర యోధుడు ఖుదీరామ్ బోస్గా మార్చాలని కోరారు. ఇదిలా ఉంటే.. 13 మంది సభ్యులతో కూడిన ఎన్డీఎంసీ ఈ లేఖను పరిశీలనకు తీసుకుంది. ఆంగ్లేయులు, ఇస్లాం పాలకుల గుర్తులు ఇప్పుడేందుకంటూ బీజేపీ నేతలు పేర్ల మార్పు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.