
* భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు
కోవిడ్ మహమ్మారి వల్ల భారత్ లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన ప్రకటనపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన నిరాధారమని పేర్కొన్నారు. ఇది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమేనని ఆరోపించారు. గుజరాత్ లోని కెవాడియాలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ) 14వ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖా మంత్రులు పాల్గొన్నారు.
దేశంలో కరోనా సంబంధిత మరణాల విషయంలో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. అన్ని మరణాలను సమగ్ర, సమర్థ వ్యవస్థ ద్వారా, పారదర్శకతతో నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఇండియాలో కరోనా సంబంధిత మరణాలపై డబ్ల్యూహెచ్ఓ అంచనాలను ఖండిస్తూ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. డబ్ల్యూహెచ్ఓ అంచనాలను భారత్ ఎంతమాత్రం అంగీకరించడం లేదని మాండవీయ ఉద్ఘాటించారు. భారత్ అసంతృప్తిని డబ్ల్యూహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని మాండవీయను కోరినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్ చెప్పారు.