News

సరూర్‌ నగర్ హత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు

528views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన యువకుడు నాగరాజు హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగా మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుండి హత్యపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరారు.

మతాంతర విహహం చేసుకున్నారనే ఆగ్రహంతో యువతి సోదరుడు పగతో రగిలిపోతూ మరికొందరితో కలిసి యువకుడిని వెంటాడి గడ్డపారతో కొట్టి చంపాడు. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు, పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయితే, జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు.

తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్‌ పోలీసులను.. పెళ్ళి తర్వాత బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు.. బైక్‌పై ముసారాంబాగ్ వెళ్ళారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తమ చెల్లెలిని పెళ్ళి చేసుకున్నాడనే కోపంతోనే నాగరాజును హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి