
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్ 26న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 5న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా రామానుజాచార్యులవారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జీయర్స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సాధారణంగా భాష్యకారుల సన్నిధిలో భగవద్ రామానుజాచార్యులకు కాషాయ వస్త్రం అలంకరిస్తారు. తెల్లని వస్త్రం అలంకరించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రీవైష్ణవాచార్యులైన శ్రీరామానుజులవారు ఈ రోజున శ్రీరంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటకలోని మేల్కొటెకి వెళ్లారు. ఇందుకు శ్రీరామానుజులవారి అనుయాయులైన శ్రీ కూరత్తాళ్వార్ సహకారం అందించారు.
ఆ తరువాత మేల్కొటెలో 14 ఏళ్ళపాటు శ్రీ రామానుజులు ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో 6వ రోజు తెల్లని వస్త్రాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అన్ని వైష్ణవాలయాల్లో శ్రీరామానుజులవారికి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.





