
* పశ్చిమ దేశాలకు ఆసియా దేశాల ఇబ్బందులు పట్టవంటూ వ్యాఖ్య
* ఉక్రెయిన్ పై యుద్ధంలో భారత వైఖరిని సమర్థించుకున్న భారత విదేశాంగ శాఖ…
ఉక్రెయిన్ పై రష్యా తీసుకుంటున్న సైనిక చర్య విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ఆఫ్ఘనిస్థాన్ తోపాటు పలు ఆసియా దేశాల్లోని పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు.
ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు.