
న్యూఢిల్లీ: అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధం, ఇస్లాం రాజ్యాలు, ఆహార భద్రత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం వివిధ తరగతుల సిలబస్ నుంచి సీబీఎస్ఈ తొలగించిన చాప్టర్లు ఇవి. కరోనా నేపథ్యంలో ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిలబస్ నుంచి పరీక్షలకు అవసరం లేని అంశాలను తొలగిస్తూ సీబీఎస్ఈ ప్రకటన జారీ చేసింది. 11, 12 తరగతులలోని అలీనోద్యమం, ప్రచ్ఛన్న యుద్ధం, ఆసియా- ఆఫ్రికా భూభాగాల్లో ఇస్లాం రాజ్యాల ఆవిర్భావం.. వాటి పరిణామాలు, పారిశ్రామిక విప్లవం, మొఘల్ కోర్టులు వంటి పాఠ్యాంశాలను.. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించింది. అదేసమయంలో, పదో తరగతి సిలబస్లోనూ మార్పులు చేసింది.
ఆహార భద్రత చాప్టర్లోని ‘వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం’ అనే టాపిక్ను తొలగించింది. ‘మతం, మతతత్వం, రాజకీయాలు, లౌకిక రాజ్యం’ అనే సెక్షన్లోని ఉర్దూ కవి ఫియాజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రెండు పద్యాలను తీసేసింది. ప్రజాస్వామ్యం, వైవిధ్యం అనే అంశాలపై ఉన్న కోర్సు చాప్టర్లను ఈ ఏడాదికి పక్కనబెట్టింది.
కాగా, ఈ చాప్టర్లే ఎందుకు తొలగించారన్న విషయంపై అధికారులు వివరణ ఇచ్చారు. సిలబస్ను హేతుబద్దీకరించడంలో భాగంగా వీటిని పక్కనబెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ మార్పులు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
సాధారణంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేది సీబీఎస్ఈ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ‘వన్ టైమ్ స్పెషల్ ఎగ్జామ్’ పేరిట ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. ఈ కొద్ది సమయంలో పూర్తి సిలబస్ చదవడం విద్యార్థులకు కష్టం అవుతుందని భావించి పలు చాప్టర్లను తొలగించింది. ఈ తొలగింపు ఈ ఏడాదికే పరిమితం కానుంది.
అయితే, సిలబస్లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సైతం పలు కీలక చాప్టర్లను సిలబస్ నుంచి తొలగించింది సీబీఎస్ఈ. పదకొండో తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని.. సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం వంటి చాప్టర్లను పరీక్షల సిలబస్ నుంచి తీసేసింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. వీటిని 2021-22 విద్యాసంవత్సర సిలబస్లో తిరిగి చేర్చింది.
Source: EtvBharat





