
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే తెలిపారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
కశ్మీర్ యువత, ముఖ్యంగా 20–25 ఏళ్ళ వారు హింసతో సాధించేదేమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. దీంతో, తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తెలియని 16–19 ఏళ్ళ టీనేజర్లను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
మరోవంక, కొత్త రిక్రూట్మెంట్లు 2021లో మూడో వంతుకు అంటే, 142కు తగ్గిపోయాయని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లు తగ్గాయి. స్థానికుల సహకారంతో నిఘా వ్యవస్థ బలోపేతమైంది. ఫలితంగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతం కావడమో, లొంగిపోవడమో జరిగిందని వివరించారు.
Source: Nijamtoday





