
-
చైనా విదేశాంగ మంత్రికి భారత వర్గాలు స్పష్టం
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో భారీగా దళాలు ఉన్నాయన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు.
వాంగ్ యీతో చర్చలు ముగిసిన అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, తూర్పు లడఖ్ వివాదంపైనా, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభంపైనా చర్చించామన్నారు. అరమరికలు లేకుండా, నిజాయితీగా చాలా ముఖ్యమైన ఎజెండాపై విస్తృతంగా చర్చించినట్టు తెలిపారు.
2020 ఏప్రిల్లో చైనా చర్యల వల్ల దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించామని చెప్పారు. ఈ అంశంపై మన మనోభావాలను నిజాయితీగా తెలియజేసినట్టు తెలిపారు. సాధారణ సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందని చెప్పారు.





