News

సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు!

666views

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు కొనసాగించలేరని హైకోర్టు పేర్కొంది.

ఈ ఘటనపై ఏప్రిల్ 7వతేదీలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు బిర్భూమ్ హింసాకాండపై రిటైర్డ్ ఎస్సీ జడ్జి నేతృత్వంలోని సిట్ విచారణ జరిపించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

రాంపూర్‌హాట్ హింసాకాండపై స్టేటస్ రిపోర్టును ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా సమర్పించాలని కోల్ కత్తా హైకోర్టు బెంగాల్‌ను కోరింది. జిల్లా జడ్జి సమక్షంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఘటనా స్థలంలో 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది.

కాగా, బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. చిన్నారులతో సహా ఎనిమిది మందిని కాల్చివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది.

నాలుగు వారాల్లోగా ఎఫ్‌ఐఆర్‌తోపాటు వివరణాత్మక నివేదికలు ఇవ్వాలని కోరింది. గ్రామంలోని ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయక చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. ద్వేషపూరిత హింస సంఘటనను కూడా కమిషన్ గమనించిందని, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు సరిగా లేవని సూచిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి