
-
జనసేన అధినేత పవన్ కల్యాణ్
భాగ్యనగరం: నేతాజీని గౌరవించకపోతే మనం భారతీయులమే కాదని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి
నేతాజీ అస్తికలు మన దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. నేతాజీ అస్తికలు రెంకోజి ఆలయంలో దిక్కు లేకుండా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అస్తికలు నేతాజీవి అవునా కాదా అని పరీక్షలు చేయలేరా అని పవన్కల్యాణ్ ప్రశ్నించారు.
ఇప్పటికీ మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు. నేతాజీని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలని సూచించారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పవన్ కొనియాడారు.





