
-
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: విద్యా రంగంలో టిబి మేకాలే(బ్రిటీష్ చరిత్రకారుడు. భారత్లో ఆంగ్ల మాద్యమానికి ఆద్యుడు) వ్యవస్థకు స్వస్తి పలకాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. విద్యా కాషాయీకరణ చర్యలను ఆయన సమర్థించారు. హరిద్వార్లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్ను ఆయన ప్రారంభిస్తూ విద్యా కాషాయీకరణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, అయితే, అందులో తప్పేమిటో తనకు అర్థంకావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
బ్రిటీష్ కాలం నాటి వలసవాద భావజాలాన్ని భారతీయులు విడనాడాలని ఆయన హితవు చెప్పారు. భారతీయీకరణే కేంద్రంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. మాతృభాషలకు ఇందులో పెద్ద పీఠ వేశారని గుర్తు చేశారు.
దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.





