
* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరకొండ తిరునాళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున్న ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.
ప్రకాశం జిల్లా శింగరకొండ క్షేత్రం.. మహిమాన్వితుడైన ప్రసన్నాంజనేయస్వామి కొలువైన దివ్యధామం. దేవస్థాన గరుడ స్తంభంపై చెక్కిన 1443నాటి శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని దేవరాయలు అనే రాజు పరిపాలించాడని శింగన్న అనే భక్తుడి పేర ఈ కొండకు శింగరకొండ అనే నామకరణం వచ్చిందని చెబుతారు.
250 ఏళ్ల క్రితం కొండపైనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుండగా కొండ మీద తేజోవంతుడైన మహా యోగిశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి స్వయంగా ప్రతిష్టించినట్లు చెబుతారు.
మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉత్సవాలు
ఈ ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా జరుగనున్నాయి. ధ్వజపతాక పూజ, ధ్వజారోహణతో తిరునాళ్లు ప్రారంభం అవుతాయి. రెండోరోజు రుద్రసహిత మన్యసూక్త ఏకాదశ వారాభిషేకం, స్వామికి అలంకరణ ఉంటాయి. మూడో రోజు నుంచీ స్వామి దివ్య దర్శనం ప్రారంభమవుతుంది. ప్రధాన తిరునాళ్ల 18 నుండి 19 వ తేదీ మధ్యాహ్నం వరకు జరుగుతుంది.





