News

విద్యార్థులతో 75 శాటిలైట్లు తయారీ

401views

నెల్లూరు: 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 75 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఉపగ్రహాలన్నీ విద్యార్థులతోనే తయారు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 2023 మధ్యకాలం వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించనుంది. ఈ మేరకు యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ విశ్రాంత సంచాలకుడు మయిల్‌సామి అన్నాదురై మార్గదర్శకత్వంలో ‘ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టు’ చురుగ్గా సాగుతోంది.

దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, పాఠశాలల్లోని ఔత్సాహిక విద్యార్థులను ప్రాజెక్టులో భాగస్వాములను చేస్తున్నారు. ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ అసోసియేషన్‌(ఐటీసీఏ) విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, సమన్వయం చేస్తోంది. ఉపగ్రహాలను తయారు చేయించడం, నిర్మించడం, పరీక్షించడం వంటి పనులన్నీ విద్యార్థులే చేయనున్నారు.

ప్రాజెక్టులో పాల్గొనే విద్యార్థులకు భారత స్పేస్‌ స్టార్టప్‌ సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఆకృతి, అభివృద్ధి, ఫ్యాబ్రికేషన్‌, పరీక్ష, ప్రయోగం తదితర వాటికి ఇస్రో సహకరిస్తోంది. ఖర్చు మాత్రం చాలా వరకు ఆయా విద్యా సంస్థలే భరిస్తున్నాయి. కర్ణాటకలో పాఠశాలల విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాల కోసం అక్కడి ప్రభుత్వం నిధులు ఇస్తోంది. విద్యార్థులు చేసేవన్నీ నానో ఉపగ్రహాలు. ఒక్కొకటి 10 కిలోల కంటే తక్కువ బరువు ఉంటాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి