
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బందీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, ఆ న్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు, భారత్కు స్పష్టం చేసింది. జాదవ్పై పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించేందుకు.. ఆయన తరఫున న్యాయవాదిని నియమించాలని పేర్కొంది.

ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. భారత్ ఈ వ్యవహారంలో కావాలనే జాప్యం చేస్తోందన్నారు. తద్వారా మరోసారి పాకిస్తాన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందన్నారు.
కాగా.. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి కులభూషణ్కు 2017 ఏప్రిల్లో పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. కాగా, పాకిస్తాన్.. కులభూషణ్కు దౌత్య సాయం అందించే విషయంలో అడ్డుచెబుతోందని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను భారత్ ఆశ్రయించింది. కులభూషణ్ మరణ శిక్షపై పునః సమీక్ష చేయాలని.. ఆయనకు దౌత్య సాయం అందించాలని ఐసీజే తీర్పునిచ్చింది.
Source: V6 Velugu
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





