
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులు తాము ప్రేమగా పెంచుకున్న జంతువులతో భారత్కు క్షేమంగా చేరుకుంటున్నారు. డేహ్రాడూన్కు చెందిన విద్యార్థి రిషభ్ కౌశిక్ తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం స్పందించి, జంతువులను కూడా తీసుకురావచ్చని అనుమతి ఇవ్వడంతో అక్కడి భారతీయులు తమ శునకాలతో స్వదేశానికి చేరుకుంటున్నారు.
కాగా, ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిషిత్ ప్రామాణిక్ హంగేరీ నుంచి వచ్చిన 219 మంది విద్యార్థులకు ఢిల్లీలో స్వాగతం పలికారు. మరో రెండు రోజుల్లో 7,400 మంది భారత్ చేరుకోనున్నట్టు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం 3,500 మందిని, శనివారం మరో 3,900 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నట్టు తెలిపింది.
Source: EtvBharat





