
రాజస్థాన్: రాజస్థాన్, కోటాలోని కైతునిపోల్ ప్రాంతం, సబర్మతి కాలనీలో విక్కీ ఆర్య అనే స్థానిక భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తను కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. విక్కీ ఆర్య తన బైక్పై వెళుతుండగా ఈ దాడి జరిగింది. చేతిలో రాడ్లు, ఆయుధాలతో ఉన్న వ్యక్తులు శుక్రవారం అతనిని ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని పసిగట్టిన ఆర్య ప్రాణభయంతో బైక్, చెప్పులు వదిలి తన ఇంటి వైపు పరుగెత్తాడు.
అయితే, దుండగులు అతనిని వెంబడించి, వీధిలో వెనుక నుండి ఇనుప రాడ్తో అతని తలపై దాడి చేశారు. అతను కింద పడిన తర్వాత, మెటల్ వాటర్ పైపులు, రాడ్లతో అతనిని కొట్టారు. ఆర్య చనిపోయాడని భావించిన తరువాత నిందితులు పారిపోయారు. ఈ దారుణ హత్య గురించి సమాచారం అందిన వెంటనే విక్కీ కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నగరంలోని ఎంబీఎస్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు బన్వారీ, అర్జున్, నిఖిల్, రాజ్, వారి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న వారందరి కోసం గాలిస్తున్నారు. 25 ఏళ్ల బీజేవైఎం సభ్యుడి హత్య తర్వాత కైతునిపోల్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఎస్హెచ్ఓలతో పాటు భారీ పోలీసు బలగాలు, ఆర్ఏసీ సిబ్బందిని భద్రత నిమిత్తం ఆ ప్రాంతంలో మోహరింపజేశారు.
Source: OpIndia





