News

సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దాం!

589views
  • చిన్న జియ్యర్ స్వామి పిలుపు

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దామని చిన్న జియ్యర్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలలో భాగంగా సామాజిక నేతల జాతీయ సమావేశంలో సందేశం ఇస్తూ.. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని సామర్థ్యాలు ఉంటాయని చెప్పారు. వ్యక్తిలోని లోపాలను చూసి పరిహసించడం కాకుండా, అతనిలోని గుణాలను సమాజ హితం కోసం ఉపయోగపడేట్టు చేయాలని ఉద్భోధించారు.

ప్రతి వ్యక్తిలోని గుణ, గణాల వికాసం కోసం సంపూర్ణ సమాన అవకాశాలను అందరికీ కల్పించాలని సూచించారు. అస్పృశ్యత పేరున సమాజానికి దూర‌మైన వర్గాల ప్రజలను హరిదాసులుగా తీర్చిదిద్ది, వారికి సమాజంలో గౌరవ స్థానం కల్పించిన ఘనత సమతా మూర్తి శ్రీ రామానుజుల వారని గుర్తు చేశారు.

మన మన సామర్థ్యాలతో తేడాలున్నా అయిదు వేళ్ళు కలిసి పనిచేసినట్టు మనమందరం అందరి మేలు కోసం కలిసి పని చేయాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో వంద‌ల ఏళ్ళుగా నివసిస్తున్న గిరిజన బాలురను చక్కటి వాతావరణంలో విద్య అవకాశాలను మనం వారికి కల్పించినప్పుడు వారు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావడం మనం నడుపుతున్న పాఠశాలల్లో చూశామని పేర్కొన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి 169 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇందులో సగం మంది ఎస్సీలు కాగా, మిగిలిన సగం మంది వివిధ కులాల వారు ఉన్నారు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బా ఫూలే, సంత్ రవిదాస్, వాల్మీకి వంటి సమత కోసం పనిచేసిన మహా పురుషుల జయంతులను అన్ని వర్గాల ప్రజలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు.

ఉన్నత కులాలుగా తమను భావించుకునే ప్రజలలో సామాజిక సమతతో కూడిన వ్యవహారాన్ని ఎలా కల్పించాలి? భారత రాజ్యాంగం అందించిన సమాన హక్కులను నిమ్న వర్గాల ప్రజలకు చేరేట్టు చేయడంలో మన పాత్ర ఏమిటి? వంటి వివిధ విషయాలపై జరిగిన చర్చను ఆర్.ఎస్.ఎస్ జాతీయ కార్యకారిని సభ్యులు భాగయ్య నిర్వహించారు.

చిలుకూరి బాలాజీ అర్చకులు డాక్ట‌ర్ రంగరాజన్ “మునివాహన సేవ” కార్యక్రమాన్ని తాను ఎందుకు నిర్వహించిందీ? దాని ప్రభావాన్ని తెలిపారు.