
ఢిల్లీ: ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
దేశంలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.రాజ్ పథ్ లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
Source: Nijamtoday





