
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నట్టు భారత రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. అయితే తదుపరి వివరాలను వెల్లడించలేదు.
గాయపడిన ఆరుగురిలో ఇద్దరు భారతీయులేనని పేర్కొంది. “మరణించిన ఇద్దరు భారతీయులను గుర్తించాము. @IndembAbuDhabi అధికారులు వారి కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నారు. మృత దేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ADNOCతో సహా UAE అధికారులతో పని చేస్తున్నాం” అని UAEలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి.
రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో డ్రోన్లకు సంబంధించి భాగాలు అక్కడి అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Source: NationalistHub





