News

గొప్ప పర్యాటక ప్రాంతంగా ‘గోవుల అభయారణ్యం’!

399views

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో 11 ఆవుల అభయారణ్యాలను పర్యాటక రంగానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపై బిజెపి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

‘‘సిమ్లా జిల్లాలోని సున్నీ వద్ద ఉన్న గోవుల అభయారణ్యంలో రూ. 2.22 కోట్లతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న గోవుల అభయారణ్యంలో ఇది ఆరవది. ఈ నెలలో బోవిన్‌ జాతి ఆవులకు అధికారికంగా తెరిచాము’’ అని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక మంత్రి వీరేందర్‌ కన్వర్‌ ఇటీవల ప్రకటించారు.

ఈ అభయారణ్యం ఆవులకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందిస్తుంది. వాటి దాణా కోసం ఆశ్రయం, మంచినీరు, పొడి/ఆకుపచ్చ పశుగ్రాసం వంటి ప్రాథమిక సౌకర్యాలు, ఇయర్‌ ట్యాగింగ్‌ ద్వారా జంతువులను గుర్తించడంతోపాటు అవసరమైన పశు వైద్య సేవలను కూడా అందిస్తుంది. మూసివున్న అభయారణ్యం ప్రాంతంలో జంతువులు సహజ జీవనం, తినే వాతావరణాన్ని కలిగిస్తున్నారు.

‘అభయారణ్యం క్రమంగా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది’ అని కన్వర్‌ భరోసా వ్యక్తం చేశారు. ప్రధానంగా విచ్చలవిడిగా తిరిగే పశువులు, పాడుబడిన ఆవులను ఉంచే ఈ అభయారణ్యం.. దేశవాళీ ఆవులు, వాటి సంతానం రక్షణ, సంక్షేమం కోసం జై రామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ అయిన హెచ్‌పి గౌసేవ ఆయోగ్‌ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.

వన్యప్రాణుల అభయారణ్యం తరహాలో ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఆవులకు అంకితం చేయడం దీని లక్ష్యం. ఇది ఈ జంతువుల సంరక్షణలో సహాయపడుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోడ్లపై దాదాపు 30,000 నుండి 32,000 విచ్చలవిడి జంతువులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు 20,000 జంతువులను వివిధ అభయారణ్యాలు, గౌ-సదన్లలో ఉంచగలిగింది.

రాష్ట్ర రాజధాని సిమ్లా నుండి 45 కి.మీ దూరంలో ఉన్న సున్నీ గోవుల అభయారణ్యంలో ఇప్పటికే దాదాపు 200 ఆవులు ఉన్నాయి. త్వరలో 500 జంతువులకు వసతి కల్పిస్తుంది. అభయారణ్యం స్థానిక, స్వదేశీ జాతులైన పహాడీ (గౌరీ), గిర్‌, రెడ్‌ సింధీ, సాహివాల్‌, థార్‌ పార్కర్‌ల పెంపకం కేంద్రంగా అభివృద్ధి చేయబడుతుందని హిమాచల్‌ వ్యవసాయ మంత్రి చెప్పారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌ స్పితి జిల్లా మినహా 11 జిల్లాల్లో ఇటువంటి గోవుల అభయారణ్యాలు, గౌ సదన్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు రూ.1.30 కోట్లతో మొత్తం ఐదు గోవుల షెడ్‌లను స్టీల్‌ ఫౌండేషన్‌లు, ముందుగా పెయింట్‌ వేసిన షీట్‌ రూఫింగ్‌తో ఒక్కోదానికి రూ.26 లక్షలతో నిర్మించారు.

పశుసంవర్ధక శాఖ ప్రస్తుతం 200 జంతువులను కలిగి ఉన్న హరి గౌసదన్‌ అనే ఎన్జీఓ సహకారంతో సున్ని వద్ద గౌసదన్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కోట్లా బరోగ్‌ (సిర్మౌర్‌), థానా కలాన్‌ ఖాస్‌ (ఉనా), హండా కుండి (సోలన్‌), ఖైరీ (హమీర్‌పూర్‌), కాంగ్రాలోని లూథన్‌లలో ఆవుల స్నాచురీలు ఉన్నాయి.

జంతువులకు పచ్చి మేత లేదా ఆవు గడ్డి (సాధారణ మేత) అందించేందుకు రూ. 38.87 లక్షలతో స్టీల్‌ స్ట్రక్చర్‌, ప్రీపెయింటెడ్‌ షీట్‌ రూఫింగ్‌తో పశుగ్రాస దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ అభయారణ్యంలో స్మగ్లర్ల నుండి రక్షణ కూడా ఉంటుంది.

ఆసుపత్రులు, జంతువులకు మేతగా సెవాన్‌ గడ్డి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన గడ్డి ఆవులకు ఉత్తమమైన నాణ్యమైన మేతగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన యంత్రాలు బయో-గ్యాస్‌ ప్లాంట్‌తో పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీతో నడిచేలా ఏర్పాట్లు చేశారు.

తన ఆదాయ వనరులను పెంపొందించడానికి, అభయారణ్యం.. బయో-ఎరువులు, జీవ-పురుగు మందులను సిద్ధం చేయాలని యోచిస్తోంది. వీటిని స్థానిక రైతులకు రాయితీ ధరలకు విక్రయించవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి