News

అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

668views
  • మఠ పెద్దలు, అధికారులు సంయుక్తంగా ఆలయ నిధులు వినియోగించాలని ఆదేశం

కర్నూలు: అహోబిల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. అహోబిలం మఠం పేరున గతంలో ఉన్న ఖాతానే వినియోగించాలని స్పష్టం చేసింది.

ఆ ఖాతాను మఠాధిపతి, ఈవో సంయుక్త ఖాతాగా మార్చి రోజువారి ఖర్చుల కోసం ఇరువురు సంతకాలతో నిధులను వినియోగించాలని పేర్కొంది. నిధులను దేవస్థానం నిర్వహణ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి , కమిషనర్, అహోబిలం ఈవోకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు వేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కర్నూలు జిల్లా ఆహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియామకాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్ హైకోర్టులో పిల్ వేశారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఈవో పేరున ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరచి నిబంధనలకు విరుద్ధంగా మఠానికి చెందిన నిధులను అందులో జమ చేస్తున్నారన్నారు. మఠాధిపతి ఖాతాలో జమ చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం అన్నారు. ఆ వివరాలను పరిణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈవో ఖాతాను స్తంభింపజేేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి