
-
అంతర్జాతీయ ఒత్తిడితో నిర్ణయం
బీజింగ్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన ‘ఇండో-పసిఫిక్ ఇనీషియేటివ్’ను చైనా తొలిసారి అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీడియో లింక్ ద్వారా ఆధ్వర్యం వహించిన ‘ఆసియాన్- చైనా డైలాగ్ రిలేషన్స్’ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
“భారత ఇండో-పసిఫిక్ ఇనిషియేటివ్ను చైనా గుర్తించింది. ఈ ప్రాంతంలోను, అంతర్జాతీయంగా ఆసియాన్ నిర్వహిస్తున్న కీలకపాత్రకు చైనా ఎప్పుడూ మద్దతిస్తుందని నొక్కి చెబుతున్నాను” అని స్పష్టం చేశారు. భారత్తో పాటు, ఆసియాన్ దేశాల చొరవతో ఇండో-పసిఫిక్ ఇనిష్షియేటివ్ను ఏర్పాటైంది.
స్వాగతించిన భారత్..
నిబంధనలతో కూడిన, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని అభిలషిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు అయిదో తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రివా గంగూలీ దాస్ మాట్లాడారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని.. బల ప్రయోగం వంటివి చేయరాదని అన్నారు. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) లక్ష్యాన్ని వివరించారు.





