
-
ప్రకటించిన మోడీ
-
పార్లమెంట్లో అధికారికంగా వెలువడనున్న ప్రకటన
-
ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఆందోళన విరమించాలని కోరారు.
చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్టు మోడీ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని అన్నారు. 3 వ్యవసాయ చట్టాల లక్ష్యం.. సన్నకారు రైతుల్లో సాధికారత తీసుకురావడం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చేవే. కానీ.. ఒక వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. ఐదు దశాబ్దాల నా ప్రజా జీవితంలో రైతుల కష్టాలను, సవాళ్లను తెలుసుకున్నానని నరేంద్ర మోదీ తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ బడ్జెట్ను ఐదింతలు పెంచినట్టు చెప్పారు.





