
వాషింగ్టన్: యాంటీ శాటిలైట్ మిస్సైల్ను రష్యా తాజాగా పరీక్షించడంతో అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత ప్రమాదకరమైన రీతిలో, బాధ్యతారహితంగా రష్యా వ్యవహరించినట్టు అమెరికా పేర్కొన్నది.
రష్యా నిర్వహించిన యాంటీ శాటిలైట్ క్షిపణి ప్రయోగం.. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాములకు ముప్పుగా మారినట్టు వెల్లడించింది. కొత్త తరహా క్షిపణిని డెవలప్ చేసిన రష్యా.. దానితో తన సొంత ఉపగ్రహాన్ని పేల్చేసింది. దీంతో రోదసీలో శకలాల సంఖ్య పెరిగిపోతోందని, దాని వల్ల ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్లకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడనున్నట్టు అమెరికా ఆరోపించింది.
రష్యా చర్యపై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్రమత్తంగా కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. దాంట్లో నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్, ఇద్దరు రష్యన్లు ఉన్నట్టు పెంటగాన్ చెప్పింది.
అంతరిక్ష కేంద్రం భూమికి సుమారు 420 కిలోమీటర్ల ఎత్తులో భ్రమిస్తున్నది. రష్యా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యపూరితంగా సొంత శాటిలైట్ను పేల్చినట్టు అమెరికా ప్రభుత్వ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. రష్యా నిర్వహించిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షల వల్ల అంతరిక్షంలో సుమారు 1,500 శాటిలైట్ శకలాలు ఉత్పన్నమయ్యాయి.
Source: Nijamtoday





