
న్యూఢిల్లీ: మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్ బ్యాంక్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం రూపొందించిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
2015లో దేశంలో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ప్రతి వెయ్యి మందికి 183 ఉండగా, 2020లో ఆ సంఖ్య 13,615కు పెరిగింది. 2015లో ప్రతి లక్ష మంది జనాభాకు బ్యాంకు శాఖలు 13.6 శాతం ఉండగా, 2020లో ఆ సంఖ్య 14.7 శాతానికి పెరిగింది.చైనా, జర్మనీ, దక్షిణాఫ్రికా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. ఆర్థిక సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి రావటం, బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగంతో పాటు నేరాలు కూడా తగ్గాయి. గత ఏడేళ్లలో భారత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే కేంద్రాలు కూడా పెరిగాయని నివేదికలో వెల్లడైంది.





