
689views
న్యూఢిల్లీ: ఈ ఏడాది బాణసంచాను పూర్తిగా నిషేధించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించే చర్యలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. దీపావళి, కాళీ పూజ, ఛఠ్ పూజ, జగధాత్రి పూజ, గురునానక్ జయంతి వంటి ఉత్సవాల్లో బాణసంచా కాల్చకుండా నిషేధం విధిస్తూ అక్టోబర్ 29న ఆదేశాలిచ్చింది కోల్కతా హైకోర్టు.
కరోనా నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మైనపు, నూనె దివ్వెలను మాత్రం వెలిగించుకోవచ్చని చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.





