
-
రచయిత్రి తస్లీమా నస్రీమ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలోని వివిధ చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారన్న కారణంగా హింస చెలరేగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చేశారు. ఆ పోస్టులను పరిగణలోకి తీసుకున్న ఫేస్బుక్ ఆమె ఖాతాను ఏడు రోజులపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు తస్లీమా. ‘ఇస్లాంకు చెందిన కొందరు హిందువుల ఇళ్ళు, దేవాలయాలపై దాడులకు దిగుతున్నారని నేను పోస్ట్ చేసినందుకే ఫేస్బుక్ నా అకౌంట్ను బ్లాక్ చేసింది. హనుమాన్ కాళ్ల వద్ద ఖురాన్ను ఉంచారన్న కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే, ఈ పని చేసింది హిందువులు కాదు.. ఇక్బాల్ హుస్సేయిన్, కానీ ఇస్లాంకు చెందిన వారు మాత్రం ఈ విషయంపై సైలెంట్గా ఉన్నారు. ఇక్బాల్కు వ్యతిరేకంగా ఏం చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో హిందూవులపై దాడులను ప్రస్తావిస్తూ తస్లీమా 1993లో రాసిన ‘లజ్జా’ నవల వివాదాస్పదమైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. 1994లో బంగ్లాదేశ్ను విడిచిపెట్టిన తస్లీమా నస్రీమ్ అప్పటి నుంచి భారత్లోని ఢిల్లీలో నివసిస్తున్నారు.





