
-
మోహరించిన భారత్ దళాలు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి సమకూర్చుకుంటున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. వీటికి దేశీయ అస్త్రశస్త్రాలు తోడు కావడంతో అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత కీలకమైన తవాంగ్ పీఠభూమి శత్రు దుర్భేద్యంగా మారింది.
భూటాన్, టిబెట్కు చేరువలోనే తవాంగ్ పీఠభూమి ఉంది. ఈ భూభాగాన్ని చైనా తనదిగా వాదిస్తోంది. అప్పట్లో తవాంగ్ నుంచి తన సేనను భారత్ వెనక్కి తీసుకుంది. దీంతో ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అలాంటి పరిస్థితి పునరావతృం కాకుండా చూసేందుకు భారత సైన్యం నేడు ఇక్కడ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు అమెరికా తయారీ చినూక్ హెలికాప్టర్లు, ఎం777 తేలికపాటి శతఘ్నులు, రైఫిళ్లను రంగంలోకి దించింది. వీటికితోడు దేశీయ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, అధునాతన నిఘా వ్యవస్థలు భారత బలగాల సత్తాను మరింత పెంచాయి.
భారత సైన్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ ఏవియేషన్ బ్రిగేడ్ను తవాంగ్కు దక్షిణాన 300 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా మోహరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనాలోని జపాన్ ఇంపీరియల్ సైన్యంతో పోరాడటానికి అమెరికా యుద్ధవిమానాలు ఇదే స్థావరం నుంచి బయల్దేరాయి. నేడు భారత ఏవియేషన్ బ్రిగేడ్లోని చినూక్ హెలికాప్టర్లు తేలికపాటి శతఘ్నులను వేగంగా పర్వతాల అవతలికి తరలించగలవు.





