News

ఫేస్‌బుక్‌లో పాపులర్‌ కోసం మతాల మధ్య చిచ్చు!

402views
  • బంగ్లా హింస నిందితుల అరెస్టు

  • ప్రధాన నిందితుడు ఫిలాసఫీ విద్యార్థి

  • దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్‌ హుస్సేన్‌ కూడా అరెస్టు

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజంపై హింసను ప్రేరేపించి, సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు ప్రధాన నిందితుడు, అతని సహచరుడు నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్‌ 17న దుర్గాపూజ సందర్భంగా పీర్‌గంజ్‌ సబ్‌జిల్లాలోని రంగ్‌పూర్‌లో తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ హింసకు దారితీసిందని షేక్త్‌ మండల్‌ ఆదివారం మేజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడు. మండల్‌ సహచరుడు మత గురువు రబీయుల్‌ ఇస్లాం(36) దహనం, దోపిడీకి పాల్పడ్డాడు.

రంగ్‌పూర్‌లోని సీనియర్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ దెల్వార్‌ హుస్సేన్‌ ముందు షైకత్‌ మండల్‌, అతని సహచరుడు రబీయుల్‌ ఇస్లాం తమ పాత్రను అంగీకరించారని అధికారులు విలేఖరులకు తెలిపారు. ఘాజీపూర్‌లో శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు డిజిటల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మండల్‌ రంగ్‌పూర్‌లోని కార్మైకేల్‌ కాలేజీలో ఫిలాసఫీ విద్యార్థి, అతని అరెస్టు తర్వాత పాలక అవామీ లీగ్‌ విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్‌ లీగ్‌ నుండి బహిష్కరణకు గురయ్యాడు. తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేశాడని ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ అధికారి ఒకరు చెప్పినట్టు బంగ్లాదేశ్‌కు చెందిన న్యూస్‌ వెబ్సైట్‌ బీడీ న్యూస్‌ 24 పేర్కొంది.

683 మంది అరెస్టు

పీర్‌గంజ్‌లో పుకారు వ్యాపించడంతో హింస చెలరేగిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మతపరమైన అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్‌ చేశాడని తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్‌ 17న జరిగిన హింసాకాండలో దాదాపు 70 హిందూ ఇళ్లు తగలబడ్డాయి. లీగల్‌ ప్రొసీడిరగ్స్‌ ప్రకారం ఇప్పటివరకు కనీసం ఏడుగురు తమ నేరాన్ని అంగీకరించారని మీడియా నివేదికలు తెలిపాయి. హింసకు సంబంధించిన కేసుల్లో 24,000 మంది అనుమానితులపై అభియోగాలు మోపారు. 683 మందిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి 70కి పైగా కేసులు నమోదయ్యాయి.

హింసకు పాల్పడిన ఇతర ప్రధాన నిందితుల అరెస్టు

సోషల్‌ మీడియాలో అక్టోబరు 13న దైవదూషణ అని ఆరోపించిన పోస్ట్‌ వైరల్‌ అయింది. దీని తరువాత, దుర్గా పూజ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మండల్‌, ఇస్లాం మతంతో పాటు, కుమిలలోని దుర్గా పూజ స్థలంలో ఖురాన్‌ను ఉంచిన ఇక్బాల్‌ హుస్సేన్‌, ప్రార్థనా స్థలంలో ఖురాన్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఫైజ్‌ అహ్మద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ బ్యానర్‌ క్రింద మైనారిటీ మత సంఘాల సభ్యులు శనివారం సెంట్రల్‌ ఢాకాలోని షాబాగ్‌ ప్రాంతంలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు.