
454views
సుకుమా: ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ సమక్షంలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. మిగతా వారందరిపై పది వేల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారంతా కుకానర్ గాదిరాస్, ఫుల్బాగ్డి, చింతగుఫా పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధికి చెందిన వాళ్లని పోలీసులు తెలిపారు. వీరందరికీ వారిపై ఉన్న రివార్డులను వారికే అందజేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ అధికారులు, జిల్లా ఎస్పీ మావోయిస్టులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు అంతా జన జీవన స్రవంతిలో కలిసి వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా జీవనం గడపాలని పోలీసులు కోరారు.





