
శివుడి చేతిలోని త్రిశూలం.. ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. ఇదిగో ఈ గ్లౌజ్ తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే చైనా సైనికుడు మూర్ఛపోవాల్సిందే. ఈ లాఠీలు తాకితే చాలు డ్రాగన్ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. గల్వాన్ లోయ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలో వీరసైనికుల మరణంతో ప్రాణహానిలేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి. 1996, 2005 సంవత్సరాల్లో భారత్-చైనా మధ్య ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాలు కాల్పులు జరిపే ఆయుధాలను ఉపయోగించకూడదు. దీంతో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుపముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా భారత్ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి.
సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఎక్కడికైనా వీటిని సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేనివిధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు. పరమశివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా కూడా ఆయుధాన్ని తయారుచేశారు. గల్వాన్ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారనీ, అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారుచేసినట్టు అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు.
”గతేడాది గల్వాన్లో భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు, టేసర్లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదులిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహానిలేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భద్రతా బలగాలకు ఈ ఆయుధాలు అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ‘వజ్ర’ పేరుతో మెరుపులతో కూడిన మెటల్ డివైజ్ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు. సప్పర్ పంచ్ పేరుతో తయారుచేసిన గ్లౌజ్ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్కు గురిచేస్తాయి” ” అని మోహిత్ వివరించారు.





