
-
జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారుల్లో సగం మందికి పైగా పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ముప్పై శాతం మంది పౌరులకు కూడా సరైన తిండి దొరకడం లేదని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటీ రియన్ విభాగం తెలిపింది.
దేశంలో ఉద్యోగాలు లేక.. ఆదాయం లేక.. ప్రభుత్వం ఆదుకోక.. ఎన్నో కఠిన పరిస్థితులను ఆ దేశం ఎదుర్కొంటూ ఉంది. అయితే, ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకోవడం చాలా ముఖ్యమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ఇచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ అంశంపై ప్రత్యేకంగా జరిగిన జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆఫ్ఘన్ను మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఆఫ్ఘన్లకు తక్షణ సహాయం అందించాలని.. అంతేకాకుండా అన్ని దేశాలతో కలిసి ముందుకుసాగే విధంగా అక్కడి పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సి ఉందని మోదీ అన్నారు.
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఉగ్రవాదానికి అడ్డాగా మారకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. ఆఫ్ఘన్ ప్రజలు పడుతున్న ఆకలి బాధలు, పోషకాహార లోపం వంటి సమస్యల తీవ్రతను ప్రతి భారతీయుడూ అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి ఆఫ్ఘనిస్తాన్కు మనవతా సహాయం అందించాలని మోదీ పిలుపునిచ్చారు. తక్షణమే ప్రపంచ దేశాలు ఆదుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఎన్నో మరణాలను చూడాల్సి ఉంటుంది.





