
-
ప్రధాని మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కనీసం ఒక పీజీ వైద్య విద్యాసంస్థనైనా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ దిశగానే కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. రాజస్థాన్లోని బన్స్వారా, శిరోహి, హనుమాన్గఢ్, దౌసాల్లో నాలుగు మెడికల్ కాలేజీలకు ఢిల్లీ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జైపూర్లోని సీతాపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని ప్రారంభించారు.
ఆరేళ్లలో తమ ప్రభుత్వం 170 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసిందని.. మరో వంద కళాశాలల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో రోగాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని.. ఆయుర్వేదం, యోగాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త జాతీయ విధానంతో దేశ ఆరోగ్య రంగంలోని లోపాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో ఆరు ఎయిమ్స్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 22కు పెరగడం సంతృప్తిగా ఉందని అన్నారు.





