News

‘విదేశీ’ నియంత్రణ ఉంటే అవి స్వదేశీ కంపెనీలు కావు!

449views
  • స్వదేశీ జాగరణ్‌ మంచ్‌

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న దృష్ట్యా దేశంలో విదేశీ నియంత్రణ కంపెనీలు అన్నింటిని ‘విదేశీ’ కంపెనీలుగానే పరిగణించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) స్పష్టం చేసింది. భారతీయ స్టార్టప్‌ల విదేశీ నియంత్రణపై ‘ఫ్లిప్పింగ్‌’ ద్వారా దృష్టి సారించి, అలాంటి భారతీయ కంపెనీలను ‘విదేశీ’గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఉదాహరణగా, ఫ్లిప్‌కార్ట్‌ అటువంటి సంస్థ అని పేర్కొంటూ, ‘ఫ్లిప్పింగ్‌’ వాల్‌మార్ట్‌ నియంత్రణలో పనిచేస్తున్నదని తెలిపింది. ‘ఇద్దరు భారతీయ యువకులు యునికార్న్‌(ఫ్లిప్‌కార్ట్‌) తయారు చేశారని చెప్పడం మనకు గర్వంగా ఉంటుంది. ఇది చివరికి 20 బిలియన్ల అమెరికా డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది. అయితే వాస్తవం ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్‌ ప్రమోటర్లు భారత్‌ నుండి దూరంగా సింగపూర్‌కు వెళ్లి తమ కంపెనీని, అనుబంధ కంపెనీలను అక్కడ నమోదు చేసుకున్నారు’ అని గుర్తు చేసింది.

కాగా, సింగపూర్‌లోని తమ కంపెనీ, అనుబంధ కంపెనీలను వాల్‌మార్ట్‌కు 77 శాతం వాటాల బదిలీ ద్వారా విక్రయించారు. ఆ కంపెనీ విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లడమే కాకుండా, భారత్‌లోని రిటైర్‌ మార్కెట్‌ వాటాను సహితం నిశబ్ధంగా ఆ విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఎస్‌జెఎం జాతీయ కో-కన్వీనర్‌ డాక్టర్‌ అశ్విని మహాజన్‌ తెలిపారు.
ఫ్లిప్పింగ్‌ అనేది ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేసి, వెంటనే లాభానికి త్వరగా తిరిగి అమ్మడం గురించి వివరించడానికి అమెరికాలో ఉపయోగించే పదం. ఎస్‌జెఎం ప్రకారం, ఒక భారతీయ కంపెనీని విదేశీ కంపెనీలో విలీనమై, తర్వాత అది భారతదేశంలో అనుబంధ సంస్థను కలిగి ఉంటుంది.

‘భారతదేశంలో ప్రారంభమైన భారతీయ వ్యవస్థాపకులను కలిగి ఉన్న అనేక వందల భారతీయ యునికార్న్‌లు ఇప్పుడు ఫ్లిప్పింగ్‌కు గురయ్యాయి లేదా విదేశీ కంపెనీలలో విలీనమయ్యాయి. వాటిలో, అత్యధికం భారతదేశంలో కార్యకలాపాలు, ప్రాథమిక మార్కెట్‌ ఉన్నాయి. దాదాపు అందరూ తమ మేధో సంపత్తిని(ఐపి) భారతీయ వనరులను(మానవ, మూలధన ఆస్తులు, ప్రభుత్వ మద్దతు మొదలైనవి) ఉపయోగించి అభివృద్ధి చేశారు’ అని మహాజన్‌ చెప్పారు.

ఎస్‌జెఎం ప్రకారం, మన దేశంలో భారత ప్రభుత్వ నియంత్రణను, భారతీయ పన్ను చట్టాలను, భారతీయ అధికారుల పరిశీలనను నివారించడానికి ఈ విధంగా చేస్తున్నారు. ‘వివిధ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్టీ కంపెనీలను విదేశీ కంపెనీలలో విలీనం చేయమని బలవంతం చేస్తారు. కొన్నిసార్లు ఈ స్టార్టప్‌లలో వారి పెట్టుబడికి ఒక షరతుగా ఉంచుతారు. ఎందుకంటే డేటా, ఐపి ప్రధాన కార్యాలయం కావాలని వారు కోరుకుంటారు. అక్కడ వారు తమ డబ్బును పెడతారు’ అని మహాజన్‌ పేర్కొన్నారు.

అమెరికా, సింగపూర్‌ వంటి అనుకూలమైన విదేశాంగ విధానాల కారణంగా ఆయా దేశాల నుండి ఈ విధంగా చేయగలుగుతున్నారు. అక్కడ తక్కువ కార్పొరేట్‌ పన్ను, స్థిర జిఎస్‌టి, సున్నా మూలధన లాభాల పన్ను రేటు, డబుల్‌ టాక్సేషన్‌ ఎగవేత ఒప్పందాలు, క్లిష్టమైన సమస్యలపై సాధారణ మెజారిటీ ఓటు, ఐపి రక్షణ చట్టాలు వంటివి వారికి వేగంగా వృద్ధికి సహకరిస్తుంటాయి.

అటువంటి కంపెనీలు భారత దేశంలోనే నమోదు చేసుకొనే విధంగా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తమ విధానాలు, నిబంధనలతో మార్పులు తీసుకు రావలసి ఉన్నదని మహాజన్‌ స్పష్టం చేశారు. ‘దేశీయ, విదేశీ సంస్థలను ఆకర్షించే భేదాత్మక విధానాలు ఆపాలి. ఏదేమైనా, చివరికి భారతీయ స్టార్టప్‌లను విదేశీ కంపెనీలతో కలవడాన్ని నిరుత్సాహపరిచేందుకు, మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఫ్లిప్‌ చేసే వారిని విదేశీ కంపెనీగా ప్రకటించాలి’ అని మహాజన్‌ డిమాండ్‌ చేశారు.

‘ఫ్లిప్పింగ్‌’ భారతదేశానికి ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుందని ఎస్‌జెఎం తెలిపింది. ‘భారతదేశం నుండి 90 శాతంకు పైగా విలువ సృష్టించినప్పటికీ, భారతీయ కంపెనీ విదేశీ కార్పొరేషన్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారడం వలన విపరీతమైన ఆర్థిక, జాతీయ నష్టానికి దారితీస్తుంది, ఫలితంగా మూలధన లాభాలు, పబ్లిక్‌ లిస్టింగ్‌, కార్యాచరణ లాభాలు మొదలైన వాటిపై భవిష్యత్తు పన్ను మొత్తం కోల్పోతాము’ అని మహాజన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎస్‌జెఎం ప్రకారం, ఇది క్లిష్టమైన వినియోగదారు డేటా, ఐపి విదేశాలకు బదిలీ చేయబడటానికి కూడా దారితీస్తుంది. ‘ఫ్లిప్పింగ్‌ అన్ని క్లిష్టమైన డేటాపై భద్రతా ముప్పును విధిస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన అన్ని సంబంధిత ఐపిల నుండి భవిష్యత్తులో సాధ్యమయ్యే విలువను గణనీయంగా కోల్పోతుంది’ అని మహాజన్‌ చెప్పారు.

విదేశీ హెచ్‌క్యూ నిర్మాణాల కారణంగా, భవిష్యత్తులో యుద్ధం లాంటి కార్యకలాపాలు తలెత్తిన పక్షంలో దేశానికి భద్రతా సమస్యలకు దారితీసే ఈ కంపెనీలకు మద్దతు ఇచ్చే డబ్బు మూలాన్ని భారత ప్రభుత్వం గుర్తించలేకపోతుందని మహాజన్‌ పేర్కొన్నారు.

దేశీయ పారిశ్రామికవేత్తల కన్నా ఇటువంటి విధానం విదేశీ పెట్టుబడిదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కూడా ఇస్తుందని ఎస్‌జెఎం ఆందోళన వ్యక్తం చేసింది. ‘విదేశీయులకు భారతదేశం రెడ్‌ కార్పెట్‌ చుట్టి, స్వదేశీయులకు రెడ్‌ టేప్‌ చూపించడానికి ఫ్లిప్పింగ్‌ సరైన ఉదాహరణ. వివిధ రాష్ట్రాలలో భూ కేటాయింపుల సమయంలో విదేశీ సంస్థలు మినహాయింపులను పొందుతాయి. అయితే స్వదేశీయులను తమను తాము రక్షించుకోవడానికి వదిలివేస్తున్నారు’ అని ఆయన వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి