
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోన్న వేళ కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ కేసును మొదటిగా ఆఫ్రికాలో గుర్తించారు. ఆఫ్రికా పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియాలో మరణించిన రోగి నుంచి సేకరించిన నమూనాలలో ఈ వైరస్ ను కనుగొన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
గబ్బిలాల ద్వారా వ్యాప్తి…
గబ్బిలాల ద్వారా సోకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకితే 88% వరకు మరణాల రేటు ఉంటుందని డబ్లూహెచ్ఓ తెలిపింది. రక్తస్రావ జ్వరానికి కారణమయ్యే అత్యంత తీవ్రమైన వ్యాధి మార్బర్గ్ వైరస్. ఎబోలా వైరస్ లక్షణాలు కలిగినటువంటి ఈ వైరస్.. కోవిడ్-19 మాదిరిగానే జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే.. మార్బర్గ్ వైరస్ ప్రమాదకరమని.. ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. మొదట్లోనే నిలువరించాలని ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయిటి పేర్కొన్నారు. గినియాలో గతేడాది ఎబోలా వైరస్ సోకి 12 మంది మరణించారు. ఆ వైరస్ను అరికట్టిన నెలల్లోనే మార్బర్గ్ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గినియా ప్రభుత్వం కూడా మార్బర్గ్ కేసును ధ్రువీకరించింది.





