
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాలను చూస్తూ ఉంటే.. రాబోయే రోజుల్లో అక్కడ ఇంకెంత మారణహోమాన్ని సృష్టిస్తారోననే అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయి. ఇప్పటికే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులను, విద్యావేత్తలను చంపేశారు. తాలిబాన్లు చేస్తున్న అరాచకాలు బయటకు రాకుండా ఇప్పటికే జర్నలిస్టులను కూడా చంపేశారు. రేడియో-టీవీ స్టేషన్స్ ను కూడా వాళ్లు తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఇక సాధారణ ప్రజలపై కూడా తాలిబాన్లు షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు.
ఓ అమ్మాయి శరీరాన్ని అతుక్కుని వుండే దుస్తులు ధరించిందన్న ఆరోపణతో ఆమెను తాలిబన్లు అత్యంత దారుణంగా చంపారు. ఆమె పేరు నజానిన్.. 21 సంవత్సరాల ఆ యువతి బయటకు వెళ్తుండగా తాలిబన్లు చంపేశారని పోలీసులు వెల్లడించారు. మహిళలు ఎవరూ ఉద్యోగాలు చేయకూడదని, పని కోసం బయటకు వెళ్లకూడదని ఆదేశాలను తాలిబన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే బయట కనపడుతున్న మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నజావిన్ను తాము చంపలేదని, పోలీసులు తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తాలిబన్లు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్లో శరీరానికి అతుక్కుపోయిన బట్టలు ధరించినందుకు, మగ తోడు లేకుండా బయటకు వచ్చినందుకు మహిళను తాలిబాన్లు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాలిబాన్ నియంత్రణలో ఉన్న సమర్ ఖండ్ గ్రామంలో మహిళను కాల్చి చంపారని ఆఫ్ఘనిస్తాన్ రేడియో ఆజాది నివేదిక పేర్కొంది. నజానిన్ తన ఇంటి నుండి వెళ్లి మజార్-ఇ-షరీఫ్ కోసం వాహనం ఎక్కబోతుండగా ఆమెపై దాడి జరిగింది.





