
ఉత్తరప్రదేశ్లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం లఖన్ వూ సహా పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో భద్రతను పెంచినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానం, బృందావనంలోని ఠాకుర్ బంకె బిహారి దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ వెల్లడించారు. ఠాకుర్ బంకె బిహారి దేవాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్జీ)కి చెందిన బృందం పర్యవేక్షించిందని చెప్పారు. చమురు శుద్ధి కర్మాగారాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యమునా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా-దిల్లీ జాతీయ రహదారి సహా బృందావనం, గోవర్థన్, బర్సానా లాంటి పట్టణాల్లో ప్రజల కదలికలపై ప్రత్యేక పోలీసు బృందాలు నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
అల్ ఖైదా అనుబంధ ఉగ్రముఠా అన్సర్ ఘజ్వతుల్ హింద్కు చెందిన ఇద్దరు ముష్కరులను యూపీ ఏటీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని లఖ్నవూ, మథుర, వారణాసి, అయోధ్య సహా పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.





