
కేంద్రం కొత్త ఐటీ చట్టం అమలుతో ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా నిలిపి వేసింది. అది కూడా రెండు సార్లు నిలిపివేసిందని శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముందుగా రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ.. ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా అంటూ ట్విట్టర్కు హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది అంటూ వ్యాఖ్యానించారు.





